బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఆగస్టు 25;
హుజురాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బేడ బుడగ జంగం కులస్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 100 ఇళ్లు కూడా తమ వారికి మంజూరు కాలేదని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా తమ కులానికి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి పలు డిమాండ్లు:
గృహాలు: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల జనాభా కలిగిన బేడ బుడగ జంగాల్లో 80% మంది ఇప్పటికీ పూరి గుడిసెల్లోనే నివసిస్తున్నారని, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లలో పైలెట్ ప్రాజెక్టుగా 10,000 ఇళ్లు తమ కులానికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా మరో 10,000 ఇళ్లను పైలెట్ ప్రాజెక్టుగా కేటాయించాలని కోరారు.
కార్పొరేషన్: ఎస్సీ వర్గీకరణలో గ్రూప్-ఏలో ఉన్న 15 కులాలకు ఉపకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రధాన కులమైన బేడ బుడగ జంగాలకు చైర్మన్ పదవి ఇవ్వాలని, ఏడాదికి రూ. 5000 కోట్ల నిధిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆత్మగౌరవ భవనం: వివిధ పనుల కోసం హైదరాబాద్ వచ్చే తమ కులస్థులు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్లో 1000 గజాల స్థలం కేటాయించి ఆత్మగౌరవ భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
గుడి నిర్మాణం: తమ కులదైవం పెద్ద గుసాయి తాత జాతర నిర్వహణ కోసం కరీంనగర్ జిల్లాలో 5 ఎకరాల స్థలం కేటాయించి గుడి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వేణు హెచ్చరించారు.











