బాహు బలంన్యూస్ హుజురాబాద్/జమ్మికుంట. ఆగస్టు 7 : భూ కబ్జాదారుల నుండి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, తన సమస్యను పరిష్కరించకుంటే ఆత్మహత్యే శరణ్యమని జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లెకు చెందిన పురేళ్ల సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం అడ్డుకుంటున్న కబ్జాదారులకు స్థానిక రాజకీయ నాయకులు, పోలీసుల అండ ఉందని ఆయన ఆరోపించారు. ఈ విషయమై హుజురాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు.
సురేష్ తెలిపిన వివరాల ప్రకారం… 2012లో సురేష్ తండ్రి పురేళ్ల భద్రయ్య, పెదనాన్న పురేళ్ల రాజయ్య వద్ద మూడు గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, నాలా కన్వర్షన్, మున్సిపల్ అనుమతి, రెవెన్యూ పత్రాలు అన్నీ తమ పేరు మీద ఉన్నాయని సురేష్ చెప్పారు. అయితే, కౌటం ప్రమీల, పార్వతి సుమన్ అనే వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి తమ ఇంటి నిర్మాణం అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఈ సమస్యపై జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్కి నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా, అది సివిల్ తగాదా అని చెప్పి తమ దరఖాస్తును పట్టించుకోలేదని సురేష్ వాపోయారు. సీపీకి ఫిర్యాదు చేసినా, సీఐ తప్పుడు సమాచారం ఇచ్చి, తమ ప్రత్యర్థులతో తమపైనే తప్పుడు కేసు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో హ్యూమన్ రైట్స్ కమిషన్ను ఆశ్రయించగా, సీఐపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సురేష్ వెల్లడించారు. తనకు, తన కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆయన హెచ్చరించారు.










