బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూలై 11:
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య గారు ఉద్ఘాటించారు. స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ నిర్వహించిన “పర్యావరణ పరిరక్షణ – మన బాధ్యత” అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తమ పరిసరాలను, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దీని ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. తడి, పొడి చెత్తను వేరుచేసి, గ్రామాలలో లేదా మున్సిపల్ పరిధిలోని చెత్త సేకరణ కార్మికులకు తప్పనిసరిగా అందజేయాలని ఆయన కోరారు.
పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు తమ వంతుగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించడానికి తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో జరిగిన స్వచ్ఛ హుజురాబాద్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాల విద్యార్థులను మున్సిపల్ కమిషనర్ ఈ సందర్భంగా అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్యతో పాటు పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ సౌమ్య, మున్సిపల్ మేనేజర్ భూపతి రెడ్డి, ఉపాధ్యాయ బృందం, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.











