బాహు బలంన్యూస్ హుజురాబాద్, జులై 10: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్ చేశారు. హుజురాబాద్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు.
రైతులకు తీరని అన్యాయం:
ఎన్నికల సందర్భంగా పంటల బీమా అమలు చేస్తామని, అందులో రైతుల వాటాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఊదరగొట్టారని, అయితే నేడు రెండు సీజన్లు గడిచినా పంటల బీమా ఊసే లేదని ప్రభావతి రెడ్డి అన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడం, పంటల బీమా డబ్బులు రాకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతు ద్రోహిగా అభివర్ణించారు.
కేసీఆర్ పాలనను గుర్తు చేసిన ప్రభావతి రెడ్డి:
ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో సాగునీటికి, తాగునీటికి, విద్యుత్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారని ప్రభావతి రెడ్డి గుర్తుచేశారు. నిరుపేద, మధ్యతరగతి ప్రజల కోసం, రైతుల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గురుకుల పాఠశాలలు, దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, కాకతీయ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు:
కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదని, సంక్షేమ పథకాల అమలు నిలిచిపోయిందని ప్రభావతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని, అప్పు పుట్టడం లేదని, తాము ఏమి చేయలేమని కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా చెబుతున్నారని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజల మానసిక స్థైర్యాన్ని, రాష్ట్ర విశ్వసనీయతను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. దేశంలోనే నెంబర్ వన్గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధోగతిపాలు చేస్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ చూడలేదని ప్రజలు చెబుతున్నారని ప్రభావతి రెడ్డి పేర్కొన్నారు. ఏడాది కాలం కాకముందే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆమె అన్నారు.
రిజర్వేషన్లు, మహిళా ప్రాధాన్యతపై డిమాండ్:
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను ప్రతి నిత్యం విమర్శించడం మానుకొని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని ప్రభావతి రెడ్డి సవాల్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి కార్పొరేషన్ పదవులను మహిళలకు కట్టబెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు మంత్రిమండలిలో, కార్పొరేట్ పదవులలో తగిన ప్రాధాన్యత కల్పించి కాంగ్రెస్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభావతి రెడ్డి సూచించారు.










