బాహు బలంన్యూస్ కేశవపట్నం, జులై 10 : మోలంగూరు గ్రామంలోని సర్వే నెంబర్ 703లో ప్రభుత్వ భూముల ఆక్రమణ, నిరుపేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యంపై తెలంగాణ జన సమితి (టీజేఎస్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఈ నెల 18న తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీజేఎస్ జిల్లా అధ్యక్షులు మోరె గణేష్ హెచ్చరించారు. ఈ ముట్టడిలో అన్ని రాజకీయ పార్టీలు, యువజన, ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు.
మోరె గణేష్ మాట్లాడుతూ, ఎంఆర్ఓ, డీపీఓలపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్టర్ ఆదేశించినప్పటికీ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సర్వే నెంబర్ 703లోని ఆక్రమిత ప్రభుత్వ భూమిని గుర్తించి హద్దురాళ్లను ఏర్పాటు చేసినప్పటికీ, హద్దురాళ్ల లోపల కొందరు భూములను ఆక్రమించి అక్రమంగా రేకుల షెడ్లు, కొట్టాలను నిర్మించారని ఆయన తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల కింద ప్రతి కుటుంబానికి రెండు గుంటల భూమిని కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని మోరె గణేష్ గుర్తు చేశారు. అయితే, మిగతా ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, కేటాయించిన ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్, అనుమతులను పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని పలుమార్లు ధర్నాలు, అరెస్టులు, నిరాహార దీక్షలు, నిరసనల ద్వారా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.
జిల్లా కలెక్టర్ పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై నిరసనగా ఈ ముట్టడిని నిర్వహిస్తున్నామని మోరె గణేష్ స్పష్టం చేశారు. గూడు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ నాయకులు కోరపెల్లి శివప్రసాద్, గాజుల శ్యామ్, మోరె శ్రీకాంత్, దాసారపు శివ స్వామి, మోరె వంశీ, కోరపల్లి శివ సాయి తదితరులు పాల్గొన్నారు.










