బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూన్ 27: హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు మైకేల్ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లను పాఠశాలల్లోనే అమ్ముతూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మైకేల్ శ్రీనివాస్ ఆరోపించారు. ఈ అక్రమ దందాలను అధికారులు పట్టించుకోవడం లేదని, “మామూళ్ల మత్తులో” ఉన్నారని తీవ్ర పదజాలంతో విమర్శించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన డిమాండ్ల ప్రకారం, ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్నారని, ప్రతి తరగతికి సంబంధించిన ఫీజు వివరాలను స్పష్టంగా ప్రదర్శించడం లేదని ఆరోపించారు. పిల్లలు ఆడుకోవడానికి క్రీడా మైదానాలు లేవని, రేకుల షెడ్లలో తరగతులు నిర్వహిస్తున్నారని ఆప్ నేతలు వెల్లడించారు. పాఠశాలల్లోనే పుస్తకాలు, డ్రెస్సులు అమ్ముతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయాలన్నింటినీ పరిశీలించి, వెంటనే చర్యలు తీసుకోవాలని, అటువంటి పాఠశాలలు, కళాశాలల లైసెన్సులను రద్దు చేయాలని మైకేల్ శ్రీనివాస్ కలెక్టర్ను డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ దందాలపై అధికారులు వెంటనే స్పందించాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆప్ హెచ్చరించింది.










