బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూన్ 11: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ప్రజా పాలన’ కార్యక్రమంపై జనతాదళ్ (సెక్యులర్) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ తర్వాత వాటిని కంప్యూటరీకర ణ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
బుధవారం పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం మాట నమ్మి దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాసు వడ్లూరి అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లో కంప్యూటరీకరణ జరగకపోవడంతో కొత్త రేషన్ కార్డులు పొందడం, వాటిలో మార్పులు చేర్పులు చేయించుకోవడం సాధ్యం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజల విలువైన సమయాన్ని ప్రభుత్వం వృథా చేసిందని, దరఖాస్తులు స్వీకరించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రయోజనం చేకూరుతోందని, ప్రజా పాలన ద్వారా సమర్పించిన దరఖాస్తులు పనికిరాకుండా పోయాయని వడ్లూరి నిప్పులు చెరిగారు. ప్రజా పాలన దరఖాస్తుదారుల అప్లికేషన్లను తక్షణమే కంప్యూటరీకరణ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.










