బాహు బలంన్యూస్ ఇల్లంతకుంట ప్రతినిధి మే 25:
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా రైతులకు జీలుగ, పెసరు వంటి పచ్చిరొట్టె ఎరువు విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము డిమాండ్ చేశారు. ఆదివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్కు ముందుగానే సబ్సిడీపై ఈ విత్తనాలను రైతులకు అందించాలని కోరారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉందని, పచ్చిరొట్టె ఎరువులు భూసారాన్ని పెంచి అధిక దిగుబడులకు దోహదపడతాయని రాము గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం మే నెలలో పచ్చిరొట్టె విత్తనాలను సరఫరా చేయడం సరైన సమయమని ఆయన అన్నారు. ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ పలుమార్లు హెచ్చరించినప్పటికీ, జూన్ నెల వస్తున్నా ఇప్పటివరకు వ్యవసాయ శాఖ అధికారులు పచ్చిరొట్టె విత్తనాలను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, కరీంనగర్ జిల్లా రైతులకు పచ్చిరొట్టె ఎరువుగా ఉపయోగపడే జీలుగ విత్తనాలను సత్వరమే సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం తరపున రాము డిమాండ్ చేశారు.











