బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి, మే 19: సైదాపూర్ ఎస్సై భార్గవ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమ వారం హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. మహేందర్పై ఎస్సై భార్గవ్ దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు.
అనంతరం టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు పటిష్టంగా పనిచేస్తున్నప్పటికీ కొందరు పోలీసు అధికారుల తీరు సరిగా లేదని విమర్శించారు. ప్రజలకు పోలీసులు అంటే గౌరవం ఉండాలని, భయం ఉండకూడదని ఆయన అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని పోలీసులు విస్మరిస్తున్నారని, నియంతల్లా ప్రవర్తిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్సై భార్గవ్, కానిస్టేబుల్ ఆకాశ్రెడ్డి, రవికుమార్లను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దళితులకు స్వేచ్ఛ లేకపోవడం బాధాకరమని సంపత్ అన్నారు. దళితులు ఆత్మగౌరవంతో బతకాలంటే ఇలాంటి దాడులు ఎదుర్కోవాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. దళితులను రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారి తీవ్రంగా కొట్టడంతో మహేందర్ రెండు చెవుల కర్ణబేరులు పగిలాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్కు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని, అతని కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని ఆయన నిలదీశారు. ఈ ఘటనపై సీపీ వెంటనే స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధితుడు బత్తుల మహేందర్కు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి మారపల్లి శ్రీనివాస్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు రేణిగుంట్ల సాగర్, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు తునికి వసంత్ తదితరులు పాల్గొన్నారు.










