దళితుడిపై ఎస్సై దాడి…, సస్పెండ్ చేయాలని డిమాండ్..

బాహు బలంన్యూస్ సైదాపూర్,ప్రతినిధి మే 17: సైదాపూర్ శిక్షణ ఎస్సై భార్గవ్ ఒక దళిత యువకుడిని దారుణంగా చితకబాదిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో బాధితుడు బత్తుల మహేందర్ చెవిటివాడిగా మారడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తిప్పారపు సంపత్, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్, బాధితుడు మహేందర్‌ను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ,ఎస్సై భార్గవ్ ఒక అమాయక దళితుడిపై సైకోలా ప్రవర్తించాడని తీవ్రంగా ఖండించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా, బైక్‌పై వెళ్తున్న మహేందర్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతున్నా డని, ఆగ్రహించిన ఎస్సై భార్గవ్,”నేను మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ మాట్లాడుతావా రా” అంటూ విపరీతంగా కొట్టాడని సంపత్ తెలిపారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆకాష్ రెడ్డి కూడా “మా సార్‌కు గౌరవం ఇవ్వవా రా” అంటూ లాఠీతో మహేందర్ వీపుపై కొట్టడం మొదలుపెట్టాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు ఎస్సై భార్గవ్ తన సిబ్బందితో కలిసి మహేందర్‌ను కొట్టారని, బూతులు తిడుతూ కులంపేరుతో దూషించారని సంపత్ ఆరోపించారు. అంతేకాకుండా, బాధితుడిని బెదిరించి తనదే తప్పని ఒక లేఖ రాయించుకున్నాడని ఆయన తెలిపారు.
మహేందర్‌ను తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్చగా, చెవుల నుండి విపరీతంగా రక్తం రావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో రెండు చెవుల కర్ణభేరీలు పగిలాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని, అయితే డబ్బులు లేకపోవడంతో ఆ దళిత కుటుంబం ఆవేదనతో ఇంటికి తిరిగి వచ్చిందని సంపత్ వివరించారు.
ఇలాంటి కీచక ఎస్సై దౌర్జన్యానికి ఒక దళిత యువకుడు బలికావడం చాలా బాధాకరమని సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మరిచి రాక్షసుడిలా ప్రవర్తించిన ఎస్సై భార్గవ్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని ఆయన కోరారు.ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం మాదిగ, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు తునికి వసంత్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కదిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !