బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 13:
హుజరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో మంగళ వారం సాయంత్రం ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను గ్రామ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, నెత్తిన బోనాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.
ఈ వేడుకలో సింగాపూర్ గ్రామ జయన్న పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి ప్రత్యేకంగా బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఆమె గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు కాపాడాలని భక్తితో మొక్కుకున్నారు.
గ్రామంలోని అన్ని కులాల వారు ఈ బోనాల పండుగలో ఐక్యంగా పాల్గొన్నారు. ప్రతి ఇంటి నుండి ఒక బోనం చొప్పున తీసి, ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఊరేగింపు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. డప్పు చప్పుళ్లు,భవానీయులైన పంబాల వారి వేషం ధరించి, జమిడిక, పంబ జోడు వంటి వాయిద్యాలతో భజనల నడుమ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ పండుగ గ్రామస్తులందరికీ ఒక ప్రత్యేకమైన సందర్భమని, ఇది వారిలో ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జయన్న ఫౌండేషన్ తరపున గ్రామ అభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. ఈ బోనాల పండుగ కేవలం ఒక వేడుక కాదని,ఇది గ్రామ ప్రజలందరి ఆత్మీయ బంధానికి, సంస్కృతికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు.
మొత్తం మీద కాట్రపల్లి గ్రామంలో ఎల్లమ్మ బోనాల పండుగ అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరిగింది. గ్రామస్తులందరూ కలిసి అమ్మవారిని కొలుస్తూ, తమ ఊరిని, పంటలను చల్లగా చూడమని ప్రార్థించారు.










