బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి
శంకరపట్నం, మే 18: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో సర్వే నెంబర్ 703లోని ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుండి కాపాడి, నిరుపేదలకు అందించాలని డిమాండ్ చేస్తూ TJS, TDP నాయకులు ఆందోళన చేపట్టారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ కూడలి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా TJS జిల్లా కన్వీనర్ మోరే గణేష్, TDP పార్లమెంట్ అడ్ హాక్ కమిటీ సభ్యులు మోరే ప్రభాకర్ మాట్లాడుతూ, మొలంగూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 703లోని ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని గతంలో అనేక పోరాటాలు చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించినా, హద్దులు నిర్ణయించడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో, మే 20, 2025లోపు హద్దులు నిర్ణయించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో TJS, TDP నాయకులు షాబీర్, వీరమల్లు, శ్యామ్, సాగర్, శివస్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు










