బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 25:
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని బీజేపీ సీనియర్ నాయకులు కాశెట్టి కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ పిరికిపంద చర్యను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… ప్రశాంతంగా ఉన్న దేశంలో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు తెగబడ్డారని, ఇది అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. అభం శుభం తెలియని అమాయక పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలి:
ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వదిలిపెట్టవద్దని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాశెట్టి కుమార్ డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం క్షమించరాని నేరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించాలని కాశెట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు.










