బాహు బలంన్యూస్ హైదరాబాద్: రోమన్ కాథలిక్ చర్చి అధిపతి,ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు మార్గదర్శి అయిన పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్రైస్తవ సమాజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రేమ, కరుణ మార్గాలను బోధిస్తూ, పేదల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, శాంతి స్థాపన, అంతర్ధార్మిక సామరస్యం కోసం పోప్ ఫ్రాన్సిస్ చేసిన కృషి అసాధారణమని, స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు.
అర్జెంటీనాలో సామాన్య కుటుంబంలో జన్మించి, పోప్ స్థాయికి ఎదిగిన ఆయన నిరాడంబర జీవనశైలితో ప్రజలకు చేరువయ్యారని, వాటికన్ సిటీని, పోప్ స్థానాన్ని సామాన్యులకు మరింత సన్నిహితం చేసిన మహోన్నత గురువర్యులుగా చరిత్రలో నిలిచిపోతారని రేవంత్ రెడ్డి అన్నారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన పోప్ ఫ్రాన్సిస్ బోధనలు, సేవలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ దుఃఖ సమయంలో క్రైస్తవ సమాజానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన భక్తులకు మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు










