బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి , ఏప్రిల్ 20: మండలంలోని రంగాపూర్ గ్రామంలో కల్వరి టెంపుల్లో ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈస్టర్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఫాదర్ నెల్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక ప్రార్థనలకు ముఖ్య అతిథిగా పాస్టర్ కొమ్మగళ్లు డేనియల్ హాజరయ్యారు.
పాస్టర్ డేనియల్ తన ప్రత్యేక గీతాలతో సంఘ సభ్యులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన దైవ సందేశాన్ని అందిస్తూ, యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడటం మరియు ఆదివారం నాడు సమాధి నుండి తిరిగి లేవడమే ఈస్టర్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈ రోజును ఒక గొప్ప పండుగ దినంగా జరుపుకుంటారని ఆయన అన్నారు. ఈ పవిత్రమైన రోజున క్రైస్తవులు తమకు కలిగిన దానిలో నుండి పేదవారికి అన్నదానం లేదా వస్త్రదానం చేస్తారని ఆయన వివరించారు. క్రీస్తు చూపిన ప్రేమ, శాంతి, దయ మరియు కరుణ వంటి గొప్ప గుణాలను ప్రతి క్రైస్తవుడు తమ జీవితంలో అలవర్చు కోవాలని ఆయన బోధించారు.
వేడుకల అనంతరం, సంఘ సభ్యులు బొడ్డు మంజుల మరియు బొడ్డు కల్పన ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను ముఖ్య అతిథి పాస్టర్ డేనియల్ , ఫాదర్ నెల్సన్ – సుదిన దంపతులు మరియు సంఘ సభ్యులందరూ కలిసి కట్ చేసి పంచుకున్నారు. కేక్తో పాటు, నాగార్జున – కవిత దంపతులు మరియు బొడ్డు కోమల కుటుంబాలు అందరికీ రుచికరమైన సమోసాలను పంచిపెట్టారు.
కరీంనగర్ నుండి కే. సి. ప్రేమ్ కుమార్ – షీలా దంపతులు సంఘంలోని పేద సభ్యుల కోసం పది చీరలను పంపించారు. వాటిని ఫాదర్ నెల్సన్ చేతుల మీదుగా అర్హులైన వారికి అందజేశారు. ఈ విధంగా కల్వరి టెంపుల్లో జరిగిన ఈస్టర్ వేడుకలు భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.











