మినీ ఎన్నికల సంగ్రామానికి కౌంట్ డౌన్ ప్రారంభం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ఓటేయండి అవినీతిపరులకు ఓటేస్తే భవిష్యత్తు అంధకారమే లక్షన్నర రాజకీయ పదవులకు త్వరలో నోటిఫికేషన్? ఆదర్శ వంతులను తమ ప్రతినిధులుగా ఎన్నుకోండి ప్రజలకు ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ విజ్ఞప్తి..

బాహుబలం ప్రతినిథి హుజూరాబాద్ జూలై 05:
అసెంబ్లీ ఎన్నికలు… పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని… ఇకపై స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల రణ రంగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతు న్నదని ప్రముఖ సామాజికవేత్త…
పేరెన్నిక గల రాజకీయ విశ్లేషకులు అయినటువంటి సబ్బని వెంకట్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం హుజురాబాద్ పాత్రికేయ మిత్రులతో ఆయన మాట్లాడుతూ సర్పంచ్… ఎంపీటీసీ… జడ్పిటిసి తదితర పదవుల కాలపరమితి ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ రాజకీయ పదవులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వెంకట్ తెలిపారు. ప్రతి పదవికి అనుబంధంగా ఉప పదవులు… కోఆప్షన్ సభ్యులు ఉండటంవల్ల ఈ సంఖ్య తెలంగాణ వ్యాప్తంగా 1,22, 073 వరకు ఉందని… ఇంతమందిని కొత్తగా ఎన్నుకోవలసిన ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో కొంత కాలయాపన జరిగినట్లయితే ఈలోగా సింగిల్ విండో చైర్మన్లు మున్సిపల్ చైర్మన్ లు కార్పొరేషన్ చైర్మన్లు కూడా తమ పదవీ కాలాన్ని ముగించుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వీరిని కూడా కలుపుకున్నట్లయితే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,37, 587 మంది కొత్తవారిని తమ రాజకీయ ప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకోవాల్సి ఉంటుందని… ఓటు వేసే సమయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని… సమర్థులైన వ్యక్తులను గెలిపించినట్లయితే భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదం ఉంటుందన్న నగ్న సత్యాన్ని ప్రతి ఓటరు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆలోచించుకోవాలని సబ్బని వెంకట్ ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.

ఐదు సంవత్సరాల క్రితం వివిధ సంస్థలకు జరిగిన ఎన్నికల గడువు దాదాపుగా గురువారం నాటితో ముగియడంతో తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఇరవై రెండు వేల 73 రాజకీయ పోస్టులు ఖాలీ కాగా… వీటిని త్వరలో భర్తీ చేయవలసి ఉంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 12,814 మంది సర్పంచులు… 12,814 మంది ఉపసర్పంచులు… 88 వేల 682 మంది వార్డు సభ్యులు…606 మంది మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు…606 మంది మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు…606 మంది మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యులు.. .5817 మంది ఎంపీటీసీలు… 32 మంది జిల్లా పరిషత్ చైర్మన్లు… 32 మంది జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు… 64 మంది జిల్లా పరిషత్ ల కో ఆప్షన్ సభ్యులు… తమ పదవీకాలం ముగియడంతో బాధ్యతల నుండి తప్పుకోవడం జరిగింది. వీరి స్థానంలో తెలంగాణ వ్యాప్తంగా 1 22073 మంది రాజకీయ నిరుద్యోగులు తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవడానికి ఖద్దరు చొక్కాలకు పదును పెట్టడం అప్పుడే ప్రారంభించినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల ప్రక్రియ అనుకోకుండా అడ్డుపడకపోతే త్వరలోనే ఈ రాజకీయ ఖాళీలన్నింటిని త్వరితగతిన భర్తీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత మేరకు వెనక ముందు ఆలోచన చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి… మహిళలకు… నిరుద్యోగులకు… వ్యవసాయదారులకు ఇచ్చినటువంటి అతి ముఖ్యమైన హామీలను అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో భారీగా నష్టపోతామనే భావన అధికార పార్టీలో నెలకొందని పలువురు పేర్కొంటు న్నారు. రుణమాఫీ తర్వాత కొంత సమయం ఇచ్చి ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకున్న తర్వా త ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నిక లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి అభిప్రాయంగా కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటు న్నాయి.

త్వరలో మరో 15,414 మంది రాజకీయ నాయకులు రిటైర్డ్?

మరో 980 మంది సింగిల్ విండో చైర్మన్లు… 980 మంది సింగిల్ విండో వైస్ చైర్మన్లు… 12 740 మంది సింగిల్ విండో డైరెక్టర్లు… 128 మంది మున్సిపల్ చైర్మన్లు… 128 మంది మున్సిపల్ వైస్ చైర్మన్లు… 384 మంది మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు… 37 మంది కార్పొరేషన్ చైర్మన్లు… 37 మంది కార్పొరేషన్ వైస్ చైర్మన్లు 2025 ఫిబ్రవరి నాటికి పదవీచ్యుతులు కాబోతున్నట్లు సమాచారం. మొత్తంగా కలిపి చూస్తే 1,37,587 మంది తమ పదవుల నుండి వైదొలగనున్నారు.

“ఆణిముత్యాల” లాంటి యువతను గెలిపించండి

ఓటర్లకు ప్రముఖ “సామాజికవేత్త” సబ్బని వెంకట్ పిలుపు

ప్రజల ఆకాంక్షలకు… ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వారికి… అభివృద్ధి కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేసే యువతను రానున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించడానికి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖ సామాజికవేత్త… రాష్ట్రస్థాయి రాజకీయ విశ్లేషకులు అయినటువంటి సబ్బని వెంకట్ పిలుపునిచ్చారు. ఓటు అనే అస్త్రం ప్రయోగించడానికి ప్రతి ఒక్కరికి ఐదేళ్లకు ఒకసారి మాత్రమే అవకాశం లభిస్తుందని… ప్రలోభాలకు లోనై అంది వచ్చిన చక్కటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లయితే రాజకీయ వ్యవస్థలో ఆశించిన ఫలితాలు రాబోవు అన్న నగ్న సత్యాన్ని ప్రతి ఓటరు గుర్తుంచుకోవాలని సబ్బని వెంకట్ హితవు పలికారు. గాంధీజీ కలలుగన్న గ్రామ సీమలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవాలన్నను… పల్లెలు అన్ని విధాలుగా కళకళలాడాలన్నను సరియైన నాయకుడిని మనం ఎంచుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుందని వెంకట్ గుర్తు చేశారు. ఎవరికి ఓటు వేస్తే మన ఆశలు నెరవేరుతాయో… మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయో ఒకటికి పదిసార్లు ఆలోచించి “ఆణిముత్యాల” లాంటి యువతను తమ ప్రతినిధులుగా ఎన్నుకోవలసిందిగా సబ్బనీ వెంకట్ పిలుపునిచ్చారు. ఎవరో వస్తారని… ఏదో చేస్తారని ఆశించకుండా… ఆత్మసాక్షిగా మనం తీసుకునే నిర్ణయమే అంతిమంగా మనను కాపాడుతుందనే విషయాన్ని ఓటర్లు గమనిస్తే బాగుంటుందని వెంకట్ అభిప్రాయపడ్డారు. తాత్కాలిక హామీలకు… తాత్కాలిక ప్రలోభాలకు లొంగిపోకుండా… ముందు చూపుతో ఓటు వేయాలని ఆయన మరి మరి విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !