బాహుబలం,ఏప్రిల్ 27:హుజురాబాద్
హుజురాబాద్ పట్టణంలో నడి బొడ్డున వరంగల్ – కరీంనగర్ రహదారిని అనుకుని ఉన్న అత్యంత విలువైన వివాదాస్పద భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వెలుస్తోంది. ఈ భూముల విలువ మార్కెట్లో రూ.150 కోట్లకు పైగానే ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ వెంచర్లో హుజురాబాద్, జమ్మికుంటలకు చెందిన ఇద్దరు కీలక ప్రతినిధులు భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెంచర్లో దళితులకు చెందిన అసైన్డ్ భూములు కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఈ వెంచర్ మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంది? సర్వే నెంబర్లు ఎంత? ఎవరెవరి వద్ద ఈ భూములు కొనుగోలు చేసారు? అసైన్డ్ భూములు ఎలా కొనుగోలు చేసారు? “నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ రెవిన్యూ అధికారులు ఇచ్చారా? అన్నది చర్చనీయాంశం అవుతోంది. ఈ రియల్ వెంచర్ ప్రజల దృష్టిలో పడకుండా రోడ్డువైపు తెర వేసి (గ్రీన్ మ్యాట్) వెంచర్ ను చదును చేసే పనులు జరుగుతున్నాయి. ఈ వెంచర్ కోసం మున్సిపాలిటీకి చెందిన వాటర్ ట్యాంకర్ ను కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది ప్రధాన రహదారికి అనుకుని ఉండడంతో గజానికి రూ. 50 వేలకు పైగా విక్రయాలు చేయాలని సదరు రియల్ వ్యాపారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్లాట్లు విక్రయించేందుకు కొనుగోలు దారులకు ఇప్పటికే గాలం వేస్తున్నారు. మున్సిపల్ ప్రజాప్రతినిధులే కీలకంగా ఉన్న ఈ వెంచర్ కు మున్సిపల్ అనుమతులు తీసుకుంటారా? రెవిన్యూ యంత్రాంగం నుండి ఈ వివాదాస్పద భూములు విక్రయించేందుకు అనుమతులు ఉన్నాయా? అన్నది వేయి డాలర్ల ప్రశ్నగా మిగులుతోంది. ఈ భూముల చరిత్ర, ఎప్పుడెప్పుడు ఎవరెవరి పేర్లపైకి మారాయి? నిబంధనలు ఉల్లంఘించారా? పై సమగ్ర దర్యాప్తు జరగాలని పలువురు కోరుతున్నారు. నిజానికి అసైన్డ్ భూములు విక్రయించరాదని ప్రభుత్వ నిబంధనలు సూచిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మౌన వ్రతం పాటించడం విమర్శలకు తావిస్తోంది. హుజురాబాద్ లో అక్రమ రియల్ వ్యాపారం పై అనేక ఆరోపణలు ప్రతినిత్యం వస్తున్నాయి.

తుమ్మేటి ఫిర్యాదు

హుజురాబాద్ లో వరంగల్ – కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన సర్వే నెంబర్లు 2417, 2418/1/2/3/4 లలో 12 ఎకరాలు, 2415, 2416, 2417 లలో 7.12 ఎకరాల్లో ఉన్న భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారని, ఇందులో అసైన్డ్ ప్రభుత్వ భూములు ఉన్నట్లుగా తెలుస్తోందని, ఈ విషయమై విచారణ చేయాలని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఆరోపించారు. ఈ విషయమై అయన సి ఎం రేవంత్ రెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.
అనుమతి లేదు: మున్సిపల్ కమిషనర్

హుజురాబాద్ లో వరంగల్ కరీంనగర్ రహదారి పక్కన ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ కు మున్సిపాలిటీ నుండి ఎలాంటి అనుమతి లేదని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. శనివారం అయన విలేకరులతో మాట్లాడుతూ… అక్కడ ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. గతంలో మరో వ్యక్తి నిర్మించిన ప్రహరీ గోడను అనుమతి లేదంటూ కూల్చివేశారు. కాగా ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రహరీ గోడ విషయమై కమిషనర్ స్పందిస్తూ.. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఈ విషయం ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.










