బాహుబలం ఏప్రిల్ 27 (హుజూరాబాద్)
హుజూరాబాద్ శివారులో సర్వే నెం 496 లో మట్టి (మొరం)ని కొందరు అక్రమ రవాణా చేస్తున్నారని, కానీ అధికారులు ఈ విషయమై చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని యూత్ కాంగ్రెస్ నేత టేకుల శ్రవణ్ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హుజూరాబాద్ శివారులో సిర్సపల్లి శివారు నుండి అక్రమంగా వందల సంఖ్యలో ట్రాక్టర్ల ట్రిప్పుల మట్టి ఎలాంటి అనుమతులు లేకుండానే తరలిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు చెలరేగి పోతున్నారని, యదేచ్చగా వారి ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. తమ ఫిర్యాదులపై అధికారులు తుతూ మంత్రంగా విచారణ జరుపుతున్నారని, అధికారులు పట్టించుకోపోవడం వలన రాత్రింబవళ్ళు బయటి వెంచర్లకు మట్టి తరలిస్తున్నారని ఈ విషయమై తహసీల్దార్, ఆర్. డి.వో కు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.

అలాగే హుజూరాబాద్ పట్టణంలో 2418 సర్వే నెంబర్ లో అక్రమంగా ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారని, గతంలో మున్సిపల్ అధికారులు విచారణ జరిపి అక్కడ నిర్మించే ప్రహరి గోడ ను కూల్చి వేశారని, తిరిగి మళ్ళీ గోడను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారని, అధికారుల మాటలను సైతం సదరు అక్రమ రవాణా దారులు బేఖాతరు చేస్తున్నారని తెలిపారు. రియల్ ఎస్టేట్ వెంచర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాపై, అలాగే అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నేత టేకుల శ్రవణ్ కోరారు.










