బాహు బలంన్యూస్,తిమ్మాపూర్ ఆగస్టు 22:
సీనియర్ రాజకీయ నాయకుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్ (ఎస్ఎల్) ఆకస్మిక మరణం తీరని లోటని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ గౌడ్ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు.
శనివారం మన్నెంపల్లిలోని ఆయన నివాసంలో పార్థివ దేహాన్ని పలువురు నేతలతో కలిసి పోలాడి రామారావు సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లక్ష్మీనారాయణ గౌడ్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, కలివిడిగా ఉండే గొప్ప స్నేహశీలి అని కొనియాడారు. సామాన్యుల, రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించిన ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రజా సంఘాల తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నివాళులర్పించిన వారిలో నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గోపు మల్లారెడ్డి, చలిగంటి ఓదెలు, కరివేద సుధాకర్ రెడ్డి, మందల బక్కారెడ్డి, నన్నవేణి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.









