బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 22:
భవన నిర్మాణ కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే వివాహ కానుక నిధులు దళారుల జేబుల్లోకి చేరుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. సిర్సపల్లి గ్రామానికి చెందిన ఓ కీలక దళారి సూత్రధారిగా మారి అధికారుల కళ్లుగప్పి ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నట్లు తీవ్ర చర్చ సాగుతోంది.
బోగస్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల దందా:
రెండేళ్లు, మూడేళ్ల క్రితం పెళ్లిళ్లు చేసుకున్న వారికి సైతం ఏడాది లోపే వివాహమైనట్లు సదరు దళారి సబ్ రిజిస్ట్రార్ వద్ద తప్పుడు వివరాలు అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఒక్కడే దాదాపు 100 నుంచి 200 వరకు బోగస్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు చేయించినట్లు స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కార్మిక శాఖలో సగం సగం వాటాలు:
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా పొందిన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రాలను కార్మిక శాఖలో సమర్పించి నిధులను క్లెయిమ్ చేయిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే మొత్తంలో సగం లబ్ధిదారునికి ఇచ్చి, మిగిలిన సగం వాటాను దళారే స్వాహా చేస్తూ గత కొంతకాలంగా ఈ దందాను సాగిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దళారిపై విచారణ జరపాలి:
ఈ బోగస్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల నెట్వర్క్పై రాష్ట్ర లేబర్ కమిషనర్ తక్షణమే స్పందించి ప్రత్యేక విచారణ జరిపించాలని ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం హుజూరాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ గడ్డం విశాల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధులు కాజేస్తున్న సదరు దళారితో పాటు సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.









