బాహు బలంన్యూస్ కరీంనగర్, మార్చి 22:
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, పాలకుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏప్రిల్ 28న కరీంనగర్ వేదికగా నిర్వహించ తలపెట్టిన ‘రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరి’ సభను విజయవంతం చేయాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు. ఈ మహాసభకు మద్దతు కూడగట్టేందుకు ఆదివారం ఆయన కరీంనగర్ పట్టణంలో విస్తృతంగా పర్యటించి, వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి సభ ఆహ్వాన పత్రికను అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం సభకు సంబంధించిన గోడప్రతులను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చల్లా హరిశంకర్, రవీందర్ సింగ్, మాజీ కార్పొరేటర్లు మరియు పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొని సభకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
పార్టీలకతీతంగా రాజకీయ మద్దతు.
అనంతరం సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మిల్కూరీ వాసుదేవ రెడ్డిని, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావును, అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మర్రి వెంకట స్వామి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ లను పోలాడి రామారావు కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. వారి చేతుల మీదుగా సభ గోడప్రతులను ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ.. రైతుల పక్షాన నిలిచే ఈ మహత్తర కార్యానికి తమ పార్టీల తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని, భారీ సంఖ్యలో రైతులను సమీకరించి సభకు తరలివస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డిని కలిసి మద్దతు కోరగా, రైతు సమస్యల పరిష్కారానికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని, సభలో పాల్గొనే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
లక్ష మందితో సభను విజయవంతం చేయాలి
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ, అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులను నిర్లక్ష్యం చేస్తే పాలకులకు తగిన శాస్తి తప్పదని ఆయన హెచ్చరించారు. ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా నిర్వహించే ఈ రాష్ట్ర స్థాయి సభకు దాదాపు లక్ష మంది రైతులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే 20 వేల మంది మహిళా రైతులు, వ్యవసాయదారులు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. రైతు లోకమంతా ఏకమై ఏప్రిల్ 28న కరీంనగర్ లో జరిగే ఈ సమరభేరిని దిగ్విజయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.












