బాహు బలంన్యూస్ కమలాపూర్ అక్టోబర్ 31:: ఇటీవల సంభవించిన ‘మొంథా’ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పర్యటించారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన వరద ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి, రైతులకు, స్థానిక ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. ముఖ్యంగా, తుఫాన్ తాకిడికి ధ్వంసమైన పంట పొలాలు, దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన కల్వర్టులను వొడితల ప్రణవ్ పరిశీలించారు.
బాధితులతో ముఖాముఖి
సుడిగాలి పర్యటనలో భాగంగా ఆయన కమలాపూర్, ఉప్పల్, అంబాల, గూడూరు, గోపాలపూర్, బత్తివనిపల్లి, కన్నూర్, దేశరాజపల్లి తదితర గ్రామాలలో పర్యటించి బాధితులను నేరుగా కలిశారు. నష్టపోయిన రైతుల సమస్యలను ఓపికగా ఆలకించారు.
“బాధితులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. ప్రభుత్వం ఎటువంటి ఆలస్యం చేయకుండా పంట నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి, రైతులకు వెంటనే సరైన పరిహారం అందించాలి. అలాగే, దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి” అని వొడితల ప్రణవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ పర్యటనలో ఆయన వెంట కాంగ్రెస్ సేవాదళ్ కమలాపూర్ మండల అధ్యక్షులు శనిగరపు రమేష్ తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరద నష్టం అంచనాలో కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటామని, తక్షణ సహాయం అందేలా కృషి చేస్తామని వొడితల ప్రణవ్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.










