బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి,జూన్ 10,: హుజురాబాద్ ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చైర్మన్ తిప్పారత్ సంపత్ మాట్లాడుతూ, బత్తుల మహేందర్పై జరిగిన దాడి కేసులో గత నెల నుండి ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, దళిత సంఘాలు చేసిన ఫిర్యాదులను మన్నించి, సోమవారం ఎస్సై భార్గవ్తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం దళిత జాతి విజయంగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ, అణగారిన వర్గాలపై దాడి చేస్తే రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం సామాన్యులైనా, పోలీస్ అధికారులైనా ఒకే చట్టం వర్తిస్తుందని ఈ కేసు రుజువు చేసిందని పేర్కొన్నారు. ఈ కేసును పారదర్శకంగా విచారణ జరిపి, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని,ఎస్సై భార్గవ్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీసులపై తమకు అపారమైన గౌరవం, నమ్మకం ఉన్నాయని, ఫ్రెండ్లీ పోలీసులు సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని ప్రజలకు నమ్మకం ఉందని సంపత్ అన్నారు. కాబట్టి, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే కాలయాపన చేయకుండా, భార్గవ్ను, ఇద్దరు కానిస్టేబుల్లను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేయాలని కోరారు.
ఇకపై ఇలాంటి సంఘటనలు జరిగితే దళిత జాతి చూస్తూ ఊరుకోదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏకమయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. పోలీసులు తమ చట్ట పరిధిలో, ధర్మం ప్రకారం, రాజ్యాంగానికి లోబడి ఉద్యోగాలు చేయాలని విన్నవించారు.
సోమవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, ఎఫ్ఐఆర్ కాపీ కూడా తమకు అందిందని సంపత్ తెలిపారు. ఎస్సై భార్గవ్ను వెంటనే సస్పెండ్ చేయకుంటే, దళిత జాతి ఉద్యమాలు చేపట్టే పరిస్థితి వస్తుందని అన్నారు. తాము పోలీసులు తమ పక్షాన ఉంటారని పూర్తి స్థాయిలో నమ్ముతున్నామని, ట్రైనింగ్ ఎస్సై అయిన భార్గవ్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తొలగించని పక్షంలో న్యాయపరంగా హైకోర్టులో కేసు వేస్తామని సంపత్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ సమావేశంలో బాధితుడు బత్తుల మహేందర్తో పాటు ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారం రామచంద్రం, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు తునికి వసంత్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, కాంగ్రెస్ పార్టీ టిపిసిసి లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.










