రైతన్న మేలుకో: ఆరోగ్యం, భూమి సంరక్షణపై శిక్షణ కార్యక్రమం

బాహు బలంన్యూస్ ఎల్కతుర్తి, మే 28: రైతులు తమ ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ఎల్కతుర్తి మండలం జగన్నాథ్ పూర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బిసిఐ ఉత్తమ పత్తి యాజమాన్య పథకం, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ నిధి) సహకారంతో నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఈ శిక్షణను నిర్వహించింది.
రసాయన పురుగుమందుల ప్రమాదాలపై హెచ్చరిక
బిసిఐ మాస్టర్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ వంగ రఘు మాట్లాడుతూ, డబ్ల్యూహెచ్‌ఓ జీహెచ్‌ఎస్‌లో నిషేధిత అత్యంత విషపూరితమైన పురుగుమందులు మనుషుల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తాయని హెచ్చరించారు. ఈ పురుగుమందులు దీర్ఘకాలంలో క్యాన్సర్, జన్యుపరమైన హార్మోన్ల ప్రభావం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని, భావితరాల పిల్లలలో శారీరక, మానసిక వైకల్యాలను కలిగిస్తాయని వివరించారు. రైతులు వీటిని పూర్తిగా మానివేయాలని సూచించారు. పర్యావరణంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపి పక్షులు, జలచరాలు, జంతువులకు ముప్పు వాటిల్లుతుందని కూడా ఆయన రైతులకు వివరించారు.
పంట అవశేషాల నిర్వహణ, సేంద్రియ వ్యవసాయం
అక్కిపల్లి మౌనిక మాట్లాడుతూ, పంట అవశేషాలను కాల్చడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు గాలిలో కలిసి వాతావరణ మార్పులకు దారితీస్తాయని తెలిపారు. దీని ఫలితంగా అధిక వర్షాలు లేదా వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని, మేలుచేసే సూక్ష్మజీవులకు ప్రమాదం ఏర్పడుతుందని వివరించారు. పంట అవశేషాలను నేలలో కలియదున్నడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి, పోషకాల స్థాయి పెరుగుతుందని, దీనివల్ల రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. తద్వారా రైతులు పెట్టుబడి తగ్గించుకొని దిగుబడిని పెంచుకోవడంతో పాటు వాతావరణ మార్పులను అరికట్టవచ్చని పేర్కొన్నారు.
అనంతరం గ్రామ రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి, “రైతన్న మేలుకో ఆరోగ్యాన్ని కాపాడుకో”, “రసాయనాలు వద్దు సేంద్రియలు ముద్దు” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిసిఐ సిబ్బంది మోహన్, రాజేందర్, లత, రమేష్ తో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !