బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 23: హుజురాబాద్ పట్టణంలోని న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో గ్లోబల్ ఫోటోకాన్ కరాటే డు అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో బెల్ట్ మెరిట్ టెస్ట్లో విజయం సాధించిన కరాటే విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజురాబాద్ టౌన్ సీఐ టీ కరుణాకర్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ హాజరయ్యారు. వారు విజేతలైన విద్యార్థులను సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరాటేను వృత్తిగా ఎంచుకుని ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్న కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ను అభినందించారు. కరాటే విద్యార్థులకు మానసిక పరిపక్వతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి సమాజంలోని ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధులను చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు తమను తాము రక్షించుకోవడానికి కరాటే ఎంతగానో దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండా గణేష్, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షుడు ఖలీద్ హుస్సేన్, ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపాల్ పెండ్యాల రాజిరెడ్డి, కరాటే అసోసియేషన్ గౌరవాధ్యక్షులు అంబాల ప్రభాకర్, బి. రాజ్కుమార్, టి. గోపాల్, కరాటే మాస్టర్లు ఎస్కే జానీ, శ్రీనాథ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.










