బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 2;
దేశవ్యాప్తంగా మోడీ, అమిత్ షా రాక్షస పాలన కొనసాగుతోందని, ఆపరేషన్ కగార్ పేరుతో 350 మందికి పైగా మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అట్రాసిటీ ఇంచార్జ్ తిప్పారపు సంపత్ అన్నారు. మావోయిస్టుల ఎన్కౌంటర్లను ప్రశ్నించిన వారిపై అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి ఉప చట్టం కింద కేసులు పెట్టడం సిగ్గుచేటని ఆయన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
గిరిజనులు, చెంచులు, గోండులు, దళితులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నప్పటికీ, దానిని విస్మరించి అగ్రవర్ణాల కులాలు, కార్పొరేట్ కంపెనీలకు అడవి ఆస్తులను దోచిపెట్టేందుకే మోడీ, అమిత్ షా ప్రయత్నిస్తున్నారని సంపత్ ఆరోపించారు. మావోయిస్టులను నిర్మూలించాలంటే వారి ప్రాణాలు తీయడం సరైనది కాదని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
మావోయిస్టుల పార్టీని నిషేధించినట్లు చెబుతున్న బీజేపీ, తమ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ను దేశంలో నాలుగుసార్లు నిషేధించినప్పుడు ఎవరినీ ఎన్కౌంటర్ చేయలేదని సంపత్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మావోయిస్టులను లొంగిపోయేలా చూడాలని, కాల్చి చంపడం సరికాదని ఆయన అన్నారు. మనుషుల ప్రాణాలు చాలా విలువైనవని, గత నెల నుండి మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని లేఖలు రాసినా కేంద్రం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సైతం ఎన్కౌంటర్లు సరైన పద్ధతి కాదని చెప్పారని, మా నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని అనేకసార్లు కేంద్రానికి విన్నవించారని సంపత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ చేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కే కేశవ రావు, జానారెడ్డి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని ఆయన వెల్లడించారు. మోడీ, అమిత్ షా రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటే మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ జీడి రవితేజ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు చల్లూరి రాహుల్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు సంపంగి అరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.










