బాహు బలం న్యూస్ ఏప్రిల్ 24హుజురాబాద్:
చేనేత ఉత్పత్తిదారుల పరిస్థితి చూస్తే మనసు చలించిపోతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని చేనేత సొసైటీని మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… జమ్మికుంట పట్టణంలోని చేనేత సొసైటీ పర్యవేక్షణకు వస్తే సుమారు రూ,80 లక్షల స్టాక్ మిగిలి ఉందని గుర్తించినట్లు చెప్పారు. దీంతో పాటు హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు రూ,6 కోట్ల స్టాకు కొనుగోలు చేయకుండా మిగిలి ఉందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.15 కోట్ల వరకు స్టాక్ ఉందని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జిల్లాలోని చేనేత వస్త్రాలను మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికులకు అండగా ఉండి వారి ఉత్పత్తి చేసిన స్టాక్ మొత్తం కొనుగోలు చేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని అన్నారు. చేనేత కార్మికులకు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షల బీమా కూడా కేసీఆర్ పాలనలో ఇచ్చారని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. చేనేతకు సంబంధించిన మంత్రికి కూడా కనీసానికి వారి బాధల పట్ల అవగాహన లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.
రాజకీయాలను పక్కన పెట్టి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. చేనేత కార్మికులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జిల్లాలోని చేనేతలంతా కర్రు కాల్చి వాతపెట్టాలని అన్నారు