బాహు బలంన్యూస్ హైదరాబాద్, ఏప్రిల్ 11:
ఆధునిక యుగంలో కుల వివక్ష నిర్మూలనకు బీజం వేసి, మహిళా విద్యే ఇంటికి వెలుగు అని చాటిన సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కొనియాడారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం రామారావు మాట్లాడారు.
సమాజ మార్పుకు పునాది..
భారతదేశ చరిత్రలో సమానత్వానికి, విద్యకు పూలే వేసిన పునాదులు చిరస్థాయిగా నిలిచిపోతాయని రామారావు పేర్కొన్నారు. మహిళలు చదువుకోవడం పాపమని భావించిన రోజుల్లోనే, సమాజాన్ని ఎదిరించి తన భార్య సావిత్రిబాయి పూలేను చదివించి దేశపు మొదటి ఉపాధ్యాయురాలిగా నిలిపిన ఘనత ఆయనదేనన్నారు. ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబమే కాక మొత్తం సమాజం మారుతుందని పూలే నమ్మారని, నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండటమే అందుకు నిదర్శనమని తెలిపారు.
రాజ్యాంగానికి స్ఫూర్తి ప్రదాత:
పూలే సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకునే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో మహిళలకు, అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించారని రామారావు గుర్తుచేశారు. కుల రహిత సమాజ స్థాపన కోసం పూలే చేసిన పోరాటం నిత్య స్ఫూర్తిదాయకమన్నారు.
‘రైతు గర్జన’కు కవితకు ఆహ్వానం..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామారావు ఆమెను కలిసి పూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కరీంనగర్లో నిర్వహించనున్న ‘రాష్ట్ర స్థాయి రైతుల మహా గర్జన – సమర భేరి’ సభకు ప్రత్యేక ప్రధాన వక్తగా హాజరుకావాలని ఆమెను కోరగా, అందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు రామారావు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనా చారి, జాగృతి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ రెడ్డి, అఖిల భారత వెలమ సంఘం నాయకుడు పుస్కూరి శ్రీకాంత్ రావు, నాయకులు రూప్ సింగ్, పూర్ణచందర్ రావు, బాలాజీ రావు, సంతోష్ కుమార్, లోకిని రాజు, మహేందర్ రెడ్డి, తాండ్ర శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.











