బాహు బలంన్యూస్ హుజురాబాద్ మార్చి 11: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల బ్రతుకులపై బుల్డోజర్లు పెడుతోందని తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూదాన భూములలో నివసిస్తున్న ఇళ్లు లేని నిరుపేద ప్రజల ఇళ్లను అన్యాయంగా కూల్చివేసి, ఆ భూములను రాజకీయ బడా నాయకులకు ధారదత్తం చేసేలా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఖమ్మం వెలుగుమట్లలో బాధితుల కోసం పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క మరియు డాక్టర్ విశారదన్ మహారాజ్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని తమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.
కవితక్క దీక్షకు పూర్తి మద్దతు
పేదల పక్షాన నిలబడి పోరాడుతున్న కవితక్క ధైర్యానికి, నిబద్ధతకు తాము అండగా ఉంటామని లోకిని రాజు ప్రకటించారు. “అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గను.. బాధితులకు న్యాయం జరిగే వరకు నా దీక్ష ఆగదు” అని ఆమె చెప్పడం ప్రజల పట్ల ఆమెకున్న అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చేసి రోడ్డున పడ్డ బాధితులకు ప్రభుత్వం వెంటనే అదే చోట ఇంటి స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కవితక్క చేస్తున్న ఈ పోరాటం ఒక వ్యక్తి కోసం కాదని, బాధితుల భవిష్యత్తు కోసం అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, అప్పటివరకు ఈ దీక్షకు తెలంగాణ ఆదివాసి జాగృతి అండగా ఉంటుందని తెలిపారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని లోకిని రాజు హెచ్చరించారు.











