బాహు బలంన్యూస్ సైదాపూర్, మార్చి 10: మండల పరిధిలోని గోడిశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)గా పనిచేస్తున్న శ్రీమతి డి సరిత. అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మకమైన అమెరికన్ ఇండియా ఫౌండేషన్ (AIF) నిర్వహించే ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమానికి ఆమె ‘ఉత్తమ ఉపాధ్యాయురాలి’గా ఎంపికయ్యారు.
హైదరాబాద్లో త్వరలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. బోధనలో ఆమె ప్రదర్శిస్తున్న అంకితభావం, విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషిని గుర్తించి సంస్థ ఈ ఎంపిక చేసినట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి.
హర్షం వ్యక్తం చేస్తున్న విద్యాశాఖ అధికారులు
గ్రామీణ ప్రాంత పాఠశాలలో పనిచేస్తూ, జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న సంస్థ నుండి అవార్డుకు ఎంపిక కావడం పట్ల మండల విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిత అభినందనీయురాలని, ఆమె కృషి మరింత మంది ఉపాధ్యాయులకు స్ఫూర్తినిస్తుందని పలువురు కొనియాడారు.
ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ.. తన బాధ్యత మరింత పెరిగిందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. ఈ గుర్తింపు రావడం పట్ల ఆమెకు పలువురు ప్రముఖులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు










