చెల్పూర్‌లో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం: 1500 మందికి పరీక్షలు, 250 మందికి శస్త్రచికిత్సలకు హైదరాబాద్‌కు తరలింపు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూలై 7:హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. చెల్పూర్‌తో పాటు సిర్సపల్లి, వెంకట్రావుపల్లె, పోతిరెడ్డిపేట, జూపాక, బోత్తలపల్లె వంటి పలు గ్రామాల నుండి దాదాపు 1500 మంది గ్రామస్తులు తమ కంటి సమస్యలకు పరీక్షలు చేయించుకునేందుకు తరలివచ్చారు.
గ్రామ ప్రజల కంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ఉదయం నుంచే వందలాది మంది తరలివచ్చారు. హైదరాబాద్‌లోని శంకర్ ఐ హాస్పిటల్ నుండి వచ్చిన అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల బృందం అత్యాధునిక పరికరాలతో సుమారు 1500 మందికి పూర్తిస్థాయి కంటి పరీక్షలు నిర్వహించింది. కంటిచూపు, శుక్లాలు, గ్లకోమా వంటి వివిధ రకాల సమస్యలను ఈ పరీక్షల్లో గుర్తించారు.
పరీక్షల అనంతరం, ప్రాథమిక అంచనా ప్రకారం 250 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు. సరైన సమయంలో శస్త్రచికిత్సలు చేయించుకోకపోతే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తించిన వైద్యులు, వారికి తక్షణమే ఆపరేషన్లు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్లు అవసరమైన ఈ 250 మందిని మెరుగైన వైద్యం, శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత శంకర్ ఐ హాస్పిటల్‌కు ప్రత్యేక వాహనాల్లో తరలించారు.ఆపరేషన్ల ఖర్చులతో సహా పూర్తి వైద్య ఖర్చులను జయన్న ఫౌండేషనే భరిస్తుందని ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ శిబిరం సరిత జైపాల్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించారు.
జయన్న ఫౌండేషన్ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు అందిస్తున్న ఈ సేవలను గ్రామస్తులు ఎంతగానో అభినందించారు.ఇటువంటి ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ పొలంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలు గ్రామాల ప్రజలు మరియు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. డాక్టర్ల బృందానికి, జయన్న ఫౌండేషన్ చైర్మన్ సరిత జైపాల్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని గ్రామస్తులు కోరారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !