సబ్బని వెంకటస్వామి బహుబలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 31:
గీత కార్మికులు తాడిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలతో పాటు శాశ్వత అంగవైకల్యం కలిగి ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం ఆలోచించి గౌడ్ అన్నలకు కాటమయ్య రక్షణ కవచం శిక్షణ ఇస్తున్నామని హుజురాబాద్ ఎక్సైజ్ సీఐ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం హుజురాబాద్ మండలంలోని ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి సంవత్సరం చాలామంది గీత కార్మికులు చెట్టు ఎక్కినప్పుడు ప్రమాదవశాత్తు కిందపడి మరణిస్తున్నారని అన్నారు. రక్షణ కవచం ఉండడంవల్ల తాడు మధ్యలో అనుకోకుండా కాలు జారినప్పటికీ ఎలాంటి ప్రమాదం ఉండదని అన్నారు. గీత కార్మికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం గొప్పగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గీత కార్మికుల రక్షణ కవచం కోసం ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. శిక్షణ కాలం పూర్తయిన వెంటనే అందరికీ రక్షణ కవచాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బందితోపాటు గీత కార్మికులు పాల్గొన్నారు.












