బాహు బలంన్యూస్ హుజరాబాద్, స్వేచ్ఛ: జూన్ 02:
హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించబోయే ‘నవనిర్మాణ సభ’ను చూసి తెలంగాణలోని కొందరు నాయకులకు వణుకు పుడుతోందని ఆ పార్టీ జిల్లా నాయకుడు చిట్టి ఉదయ భాస్కర్ రెడ్డి, వీర మహిళా విభాగం రాష్ట్ర అడక్ కమిటీ సభ్యురాలు చిట్టిమణిత రెడ్డి విమర్శించారు. సోమవారం హుజరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జూన్ 2న జరిగే సభను చూసి ఓర్వలేక కొందరు నేతలు మళ్లీ ‘ఆంధ్రా – తెలంగాణ’ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
రోడ్డు వేయడం చేతకాని మంత్రి.. పవన్కు నీతులు చెప్తారా?
స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్పై ఉదయ భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “హుస్నాబాద్ ప్రజలు గెలిపించి రెండేళ్లవుతున్నా సైదాపూర్ మండలంలో కనీసం ఒక్క అభివృద్ధి పనైనా చేశారా?” అని నిలదీశారు. వంగర నుంచి హుజూరాబాద్ రోడ్డు వేయలేని మంత్రి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సాగిస్తున్న సుపరిపాలనను చూసి మంత్రి నేర్చుకోవాలని హితవు పలికారు. కరోనా, వరదల సమయంలో తెలంగాణకు పవన్ కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చినప్పుడు నోరు మెదపని వారు, ఇప్పుడు సభ పెడుతుంటే లొల్లి మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘జనజాగృతి’ నిధుల లెక్కలేవీ?: కవితకు ప్రశ్న
బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితపై జనసేన నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణ జనజాగృతి పేరుతో విదేశాల నుంచి సేకరించిన కోట్ల రూపాయల నిధుల లెక్కలు ఏమయ్యాయి? పవన్ కళ్యాణ్ అడిగి 12 ఏళ్లవుతున్నా ఎందుకు బయటపెట్టడం లేదు?” అని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో మీ కుటుంబ ఆస్తులు ఎలా పెరిగాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో యురేనియం తవ్వకాలను అడ్డుకుని, చేనేత కార్మికులను, రైతులను ఆదుకున్నది పవన్ కళ్యాణేనని గుర్తుచేశారు.
అలాగే ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్పై తప్పుడు వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత పోలీసుల పేరుతో డ్రామాలు ఆడి చివరకు క్షమాపణలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణ వాదం ముసుగులో పవన్ కళ్యాణ్పై అనుచిత విమర్శలు చేస్తే జనసేన శ్రేణులు చూస్తూ ఊరుకోవని వారు హెచ్చరించారు.










