బాహు బలంన్యూస్ కరీంనగర్, ఏప్రిల్ 09:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రి కీ.శే. ముద్దసాని దామోదర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు పోలాడి రామారావు కొనియాడారు. గురువారం కరీంనగర్ నగరంలోని మానేరు బ్రిడ్జి సమీపాన గల తీగల వంతెన కూడలిలో ముద్దసాని దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే విప్ చింతకుంట విజయరమణారావు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో నగరం జనసంద్రమైంది.
ఎన్టీఆర్ ‘అందగాడు’.. బాబు ‘డైనమిక్ లీడర్’
విగ్రహావిష్కరణ అనంతరం లక్ష్మీనరసింహ గార్డెన్స్లో నిర్వహించిన వర్ధంతి సభలో పోలాడి రామారావు మాట్లాడుతూ.. ముద్దసాని రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలంలో కమలాపూర్ కుర్రోడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన దామోదర్ రెడ్డిని పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ‘అందగాడు’ అని, నారా చంద్రబాబు నాయుడు ‘డైనమిక్ లీడర్’ అని పదే పదే ప్రశంసించేవారని గుర్తుచేశారు. 1985 నుండి వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొంది యువజన సర్వీసులు, పర్యాటక, గనులు, రవాణా, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో తనదైన ముద్ర వేశారని తెలిపారు.
రైతు పక్షపాతి.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్
ముద్దసాని దామోదర్ రెడ్డి కేవలం నాయకుడే కాక, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని రామారావు పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు చివరి భూములకు నీరు అందేలా ఆయన నిరంతరం పర్యవేక్షించేవారని, రైతుల సమస్యల పరిష్కారంలో ఆయనది మేటి చెయ్యి అని కొనియాడారు. హుజూరాబాద్, కమలాపూర్, మానకొండూర్ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, స్కూల్ భవనాలు, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఆయన విశేష కృషి చేశారన్నారు. చెరువుల పూడికతీత, చెక్ డ్యాంల నిర్మాణంతో సాగునీటి రంగాన్ని బలోపేతం చేశారని వివరించారు.
సామాజిక న్యాయమే ఆయన మార్గం..
గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండి, పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించడంలో ఆయన చూపిన చొరవ అమోఘమని పోలాడి అన్నారు. “దామోదర్ రెడ్డి నన్ను సొంత సోదరుడిలా భావించి, ప్రజా బాహుళ్యంలోకి వెళ్లేలా నన్ను తీర్చిదిద్దారు. ఆయన లేని లోటు తీర్చలేనిది” అంటూ రామారావు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఆశయాలను ఆచరించడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. 1956లో జన్మించిన ఆయన, 2012లో చిన్న వయసులోనే మరణించడం ఈ ప్రాంతానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
తరలివచ్చిన నేతలు.. వెల్లువెత్తిన అభిమానం
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దామోదర్ రెడ్డి సోదరులు మధుసూదన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి అభిమానులు భారీగా తరలిరావడం దామోదర్ రెడ్డి పట్ల ప్రజలకున్న అభిమానానికి నిదర్శనంగా నిలిచింది.










